ఇటుక బట్టీల్లో పనిచేసే ఓ రోజువారి కూలీకి కలలో కూడా ఊహించినంత డబ్బు వచ్చి పడింది. గంటల వ్యవధిలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు.. అతని అకౌంట్ లో ఏకంగా రూ.2700 కోట్లు జమయ్యాయి. అయితే ఆ ఆనందం అతనికి ఎంతోసేపు నిలవలేదు. పొరపాటును గుర్తించిన బ్యాంక్ సిబ్బంది అతని ఖాతాలో జమైన డబ్బును వెనక్కి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్కి చెందిన బిహారీ లాల్ అనే వ్యక్తి రాజస్తాన్లోని ఇటుక బట్టీల్లో కూలీగా పనిచేస్తున్నాడు. వర్షాకాలం కావడంతో ఇటుక బట్టీలు మూతపడ్డాయి. దీంతో యూపీలోని స్వగ్రామానికి వచ్చేశాడు. ఈ క్రమంలో ఇటీవల తన బ్యాంకు ఖాతాలోని డబ్బును డ్రా చేసుకునేందుకు స్థానిక జనసేవా కేంద్రానికి వెళ్లాడు.
అక్కడ తన ఖాతా నుంచి రూ.100 విత్ డ్రా చేశాడు. ఆ వెంటనే తన సెల్ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి లాల్ షాకయ్యాడు. అందులో తన ఖాతాలో రూ.2700 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. దీంతో వెంటనే బ్యాంక్ సిబ్బంది వద్దకు వెళ్లి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయాలని కోరాడు. రూ.2700 కోట్లు ఉన్నాయని చెప్పడంతో అతడు షాక్ అయ్యాడు. బ్యాంక్ స్టేట్మెంట్ ప్రింట్ కూడా తీయించి చూసుకున్నాడు..
అయితే కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి అతడి అంకౌట్ ఖాళీ అయ్యింది. కొన్ని గంటల తర్వాత తిరిగి తన అకౌంట్ చెక్ చేయగా కేవలం రూ.126 మాత్రమే ఉందని చూపింది.. అయితే అది పొరపాటు వల్ల జరిగినట్లు బ్యాంక్ అధికారి అభిషేక్ సిన్హా తెలిపారు. లాల్ అకౌంట్ ని స్తంభింపజేసి ఆ డబ్బును వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు.