మధ్యప్రదేశ్ లో ఓ ఇంటికి కరెంట్ బిల్లు వేలు.. లక్షలు కాదు ఏకంగా కోట్లలో వచ్చింది. ఈ బిల్లు చూసిన యజమాని షాకై ఆస్పత్రిలో చేరింది. గ్వాలియర్ జిల్లా శివ్ విహార్ కాలనీలో సంజీవ్ కంకనే, ప్రియాంక గుప్తా అనే దంపతలు నివాసం ఉంటున్నారు. వీరు ఉంటున్న ఇంటికి జూలై మాసానికి సంబంధించి కరెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూస్తే ఏకంగా రూ. 3,419 కోట్లుగా ఉంది.
ఈ బిల్లును సంజీవ్ కంకనే తండ్రి చూసి షాక్ అయ్యారు. బిల్లు చూసిన తర్వాత ఆయనకు జ్వరం వచ్చేసింది. వెంటనే ఆయనను సమీప హాస్పిటల్కు తరలించారు. జూలై నెల గృహ వినియోగానికి సంబంధించిన కరెంట్ బిల్లును చూసి తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకనే తెలిపారు.
ఈ విషయాన్ని రాష్ట్ర పవర్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లగా.. జరిగిన పొరపాటును గుర్తించారు. ఎక్కువ బిల్లు రావడం మానవ తప్పిదమే అని, సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సాఫ్ట్వేర్లో వినియోగించే యూనిట్ల స్థానంలో ఒక ఉద్యోగి వినియోగదారు సంఖ్యను నమోదు చేశారని.. ఫలితంగా ఎక్కువ మొత్తంతో బిల్లు వచ్చిందని స్పష్టత ఇచ్చారు. సరిచేసిన తర్వాత రూ.1,300 బిల్లు వచ్చినట్లు ఇంటి యజమానికి వివరించారు.