దేశంలో రైల్వే శాఖ ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగు పడింది. ‘భారత్ గౌరవ్’ పథకంలో భాగంగా కేంద్రం ప్రారంభించిన మొదటి ప్రైవేట్ రైలు మంగళవారం పట్టాలెక్కింది. కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ శిర్డీకి బయలుదేరింది. అయిదు రోజుల పాటు ప్యాకేజీ టూర్ కింద ఇందులో ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే తెలిపింది.
1100 మంది ప్రయాణికులతో ‘దేఖో అప్నా దేశ్’ పేరిట మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరు నార్త్లో బయలుదేరిన రైలు సాయినగర్ శిర్డీకి 16వ తేదీ ఉదయం 7.25 గంటలకు చేరుతుంది. తిరుపూరు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, మంత్రాలయం రోడ్, వాడి మీదుగా వెళ్తుంది. మంత్రాలయం రోడ్లో మంత్రాలయం ఆలయ సందర్శనార్థం 5 గంటల పాటు అక్కడ ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సాయినగర్ శిర్డీలో 17వ తేదీ ఉదయం 7.25 గంటలకు బయలుదేరి కోయంబత్తూరు నార్త్కు 18న మధ్యాహ్నం 12 గంటలకు చేరుతుంది.
ఆధునిక హంగులతో బోగీలు తయారు చేశారు. ఈ రైలులో వైద్యుడు అందుబాటు ఉంటాడు. రైల్వే పోలీసులతో పాటు ప్రైవేటు భద్రతా సిబ్బంది, ఎసి మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది ఉంటారు. రుచికరమైన శాఖాహార వంటకాలు అందిస్తారు. ప్యాకేజీలో భాగంగా విఐపి దర్శనం, బస్సు వసతులు, ఎసి బస వసతితో పాటు టూరిస్టు గైడ్లను అందుబాటు ఉంటారు.