‘బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు’.. చిన్నారి హత్యాచారంపై నాని షాకింగ్ ట్వీట్..!

సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి ఘటన ఎంతో మందిని కదిలించింది. ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ పెరిగిపోయింది.. ఈ ఘటనపై సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. కీచకుడు రాజును పట్టుకుని కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించాడు. ఈక్రమంలో మీడియాపై కూడా విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని మీడియా హైలెట్ చేయడం లేదంటూ విమర్శించాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాడు. 

తాజాగా ఈ ఘటనపై హీరో నాని సైతం స్పందించాడు. తెలంగాణ పోలీస్ ట్వీట్ ను షేర్ చేస్తూ ‘బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు’ అంటూ కామెంట్ చేశాడు. హత్యాచారం కేసులో నిందితుడు పల్లకొండ రాజును త్వరగా పట్టుకోవాలనే డిమాండ్ పెరుగిపోతుంది. #WhereIsPallakondaRaju అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా వేదికగా అనేక మంది ట్వీట్లు చేస్తున్నారు. 

కాగా పల్లకొండ రాజు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గాలింపును డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కల్లు, మద్యం దుకాణాలు, లేబర్ అడ్డాల్లో పోలీసులు గాలిస్తున్నారు. గతంలో మేనత్త కుమార్తె మౌనికను రాజు ప్రేమించి పెళ్లి చేసుకోగా, అతడి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాజు ఒంటరిగానే ఉన్నాడు.   

Leave a Comment