ఆరేళ్ల చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్..!

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు.  ‘ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటన చూస్తుంటే సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్న ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఆ చిన్నారి కుటుంబం ఎంత దుఖంలో ఉందో ఊహించలేం’ అంటూ మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని, చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని మహేశ్ అధికారులను కోరారు. 

కాగా హత్యాచారం చేసిన నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. ఈక్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు రివార్డు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. అతడి ఆనవాళ్లను కూడా విడుదల చేశారు.  హీరో మంచు మనోజ్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని మనోజ్ పిలుపునిచ్చాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. అంతే కాదు ఈ ఘటనపై మీడియా వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశాడు.  

 

Leave a Comment