తరగతి గదిలో మద్యం తాగుతూ.. స్కూల్ ను బార్ లా మార్చిన టీచర్..!

విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బడినే బార్ గా మార్చాడు.. తరగతి గదిలోనే విద్యార్థుల ముందు మద్యం తాగుతూ.. బిర్యానీ తిన్నాడు. ఇదేంటని ప్రశ్నించిన మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పాకాల మండలం కృష్ణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  గురువారం జరిగింది. 

పాఠశాల ఉపాధ్యాయుడు కె.కోటేశ్వరరావు తరగతి గదిలోనే విద్యార్థుల ముందు మద్యం తాగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. చిన్న తప్పులకు బెత్తంతో కొట్టడం, ఆడ పిల్లలను బట్టలు విప్పించి తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి అవమానిస్తున్నాడని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇదేంటని అడిగిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆ ఉపాధ్యాయుడు ఆసభ్యంగా మాట్లాడాడు. 

ఉపాధ్యాయుడు మద్యం తాగుతున్న దానిని ఓ మహిళ వీడియో తీసింది. వీడియో చిత్రీకరిస్తున్న సమయంలోనూ ఆ ప్రబుద్ధుడు తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. బట్టలు విప్పుతాను తీసుకుంటావా అంటూ ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియోను మండల విద్యాధికారికి పంపారు. దీంతో అధికారులు ఈ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment