కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన విజయశాంతి సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడారు. 1998 జనవరి-26న బీజేపీలో తన రాజకీయ జీవితం ప్రారంభించానని తెలిపారు.
తెలంగాణ కోసం చాలా కష్ట పడ్డానని, కొన్ని కారణాల వల్ల బీజేపీని వదిలి బయటకు వచ్చానని చెప్పారు. 2005 మే నెలలో బయటకు వచ్చి తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీ నెలకొల్పాన్నారు. తన రాజకీయ జీతంలో అనేక అంశాలపై పోరాడానన్నారు. టీఆర్ఎస్ కోసం ఎవరు ఉండకూడదని, ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో సీఎం కేసీఆర్ వ్యవహరించారని విమర్శించారు.
పార్టీని విలీనం చేయమని తనపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారన్నారు. కేసీఆర్ కన్నా తాను ముందుగా తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చానన్నారు. కేసీఆర్ తన కుటుంబమే ఉద్యమంలో ఉండాలనుకున్నారన్నారు. టీఆర్ఎస్ నుంచి ఇద్దరం ఎంపీలుగా గెలిచామని, 2013లో జూలైలో అదే రాత్రి తనను సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చారు. ముందు నుంచే తనపై కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. తానే పార్టీ నుంచి బయటకు వెళ్లానని ప్రచారం చేశారని కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించారు.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పారన్నారు. కానీ చివరికి ఆయన యూటర్న్ తీసుకున్నారన్నారు. తెలంగాణలో కొట్లాడే నేతలు ఉండకూడదన్న యోచనలో కేసీఆర్ అందర్నీ ఆ పార్టీలో చేర్చుకున్నారన్నారు. కానీ.. ప్రస్తుతం తెలంగాణ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగిందని, కేసీఆర్ను గద్దె దించుతామని, ఆయన అవినీతిని బయటపెడతానని విజయశాంతి పేర్కొన్నారు. తెలంగాణలో అత్యధికంగా అవినీతి జరుగుతోందని, రేపు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, విజయ శాంతి ఎక్కడ ఉన్న కీలక పాత్రే పోషిస్తుందని చెప్పుకొచ్చారు.