కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నాటు బాంబు పేలడంతో ఏడో తరగతి విద్యార్థి మరణించాడు. దీంతో జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. వివరాల మేరకు అవుకు మండలం చెన్నంపల్లికి చెందిన వర కుమార్ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన స్నేహితుడు డేవిడ్ రాజ్ ఇంటికి వెళ్లాడు. డేవిడ్ రాజ్ వద్ద సైకిల్ రిపేర్ టూల్ కిట్ తీసుకుని సమీపంలోని వాము దొడ్డిలోకి వెళ్లాడు.
అక్కడ కొందరు నాటు బాంబులను దాచి ఉంచారు. వాటిని క్రికెట్ బంతులుగా భావించి వర కుమార్ తీసుకొని ఆడుకుంటున్న సమయంలో బాంబు పేలింది. దీంతో కుమార్ కు తీవ్ర గాయాలయ్యయి. రెండు చేతులు మణికట్టి వరకు తెగి పడ్డాయి. చికిత్స కోసం వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. అయితే నాటు బాంబు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.