ఆగిన పసికందు గుండె.. ప్రాణం పోసిన అంబులెన్స్ సిబ్బంది..!

ఆగిపోయిన పసికందు గుండెకు 108 సిబ్బంది మళ్లీ ఊపిరిపోశారు. ఈ అరుదైన ఘటన కరీంనగర్ లో జరిగింది. మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళ మూడు రోజుల క్రితం ఓ బాబుకు జన్మనిచ్చింది. 

అయితే అనారోగ్యం కారణంగా ఆ బాబును మంగళవారం కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే పసికందు పరిస్థితి విషమించింది. వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు తెలిపారు. దీంతో సీరియస్ కండిషన్ లో ఉన్న బాలుడిని కరీంనగర్ నుంచి వరంగల్ కు అంబులెన్స్ లో తరలిస్తున్నారు. 

అయితే అంబులెన్స్ లో ప్రయాణిస్తుండగా, ఆ పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో అంబెలెన్స్ సిబ్బంది వెంటనే హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  

 

Leave a Comment