విపత్తు సమయంలో రాజకీయాలా? : చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై శ్రద్ద పెట్టకుండా ఈ విపత్కర సంక్షోభంలో కూడా రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టిపెట్టడం భావ్యం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై సర్వే చేయడం తగదని ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో తీర్మానించిన 15 అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అనేక చోట్ల జేసీబీలతో ఇళ్ల స్థలాలు చదును చేయడం, యూనివర్సిటీల పాలకమండళ్ల నియామకంలో ఒకే సామాజికవర్గం వారిని పెద్ద ఎత్తున నియమించడం సరికాదన్నారు. 

ఏపీలో కరోనా స్వల్పకాలంలోనే మూడో దశకు చేరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్నారు. మొదటి, రెండో దశలోనే వైరస్‌ వ్యాప్తిని నిరోధించి వుంటే ఈ ప్రమాదం వాటిల్లేది కాదని నిపుణులే చెబుతున్నారని వెల్లడించారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మొదటి నుంచి కరోనా తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ప్రభుత్వంలోని వివిధశాఖల అధికారులతో, నిపుణులతో చర్చించి రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా సరైన నిర్ణయాలు సత్వరమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా విపత్తు దృష్ట్యా లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించాలని కోరారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌పై పూర్తి శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలని సూచించారు.

కరోనా బాధితులకు సేవలందిస్తూ మృతి చెందిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్లకు రూ.50లక్షల ఇన్సూరెన్స్‌ కేంద్రం ప్రకటించిందని, దానితో పాటు కరోనా సోకి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25లక్షల ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఒక వైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌, గ్రావెల్‌ తవ్వకాలు, ఇసుక, మట్టిని వందలాది లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని చోట్లా దొంగచాటుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ప్రేక్షపాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా సూచనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ, నాయకులను నిందించడం మానుకోవాలని కోరారు.

 

Leave a Comment