అమరావతి : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానికి వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను వారికి తెలిపారు. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి గల కారణాలను వివరించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నమోదైన 132 కరోనా పాజిటివ్ కేసుల్లో 111 మంది జమాత్కు వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్నావారేనని సీఎం తెలిపారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల వారిగా సర్వే చేపడుతున్నామని, అనుమానితులను నిర్బంధం కేంద్రాలకు తరలించి వైద్య సదుపాయం అందిస్తున్నామని ప్రధానికి వివరించారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా సహాయం చేయాలని సీఎం జగన్ కోరారు. కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు వైద్య పరికరాలను అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.