న్యూఢిల్లీ : సైనిక్ బోర్డుకు సహాయం అందించాలంటూ బ్రిగేడియర్ వీరేంద్ర కుమార్ లేఖ తనను కదిలించిందని జనసేన నేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకే తన వంతు సహాయంగా కోటి రూపాయాలు అందించానని చెప్పారు. గత పర్యటనలోనే ఇవ్వాలని అనుకున్నప్పటికీ వీలుకాలేదని అన్నారు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డ్కి సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మన సాయం సైనిక కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది’ అని పవన్ తెలిపారు. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పవన్ ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి చేరుకుని అమరసైనిక కుటుంబాల కోసం రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జీతో పవన్ను సైనిక అధికారులు గౌరవించారు.