విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో ‘ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ప్రక్రియ’పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్దతిలో పారదర్శకంగా జరుపుతామన్నారు. ఎన్నికలు జరపడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని తెలిపారు. ఎన్నికల విషయంపై శుక్రవారం జిల్లా అధికారుల, ఎస్పీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమవుతామని తెలిపారు. పార్టీల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో లక్షా ఇరవై వేల బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, మరో 40 వేల బాక్సులు తెలంగాణ నుంచి తీసుకుంటామని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ రమేష్ పేర్కొన్నారు.