అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా.. అర్హతలు, విధి విధానాలు ఇవే..!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని మార్గదర్శకాలతో కూడిన జీవోను సాంఘిక సంక్షేమ శాఖ శనివారం విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల పేద అమ్మాయిల వివాహాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైఎస్సార్ షాదీ తోఫా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

ఎంత ఇస్తారంటే.. 

  • ఎస్సీ, ఎస్టీలకు – రూ.లక్ష
  • ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు – రూ.1.20 లక్షలు
  • బీసీలకు – రూ.50 వేలు
  • బీసీల కులాంతర వివాహాలకు రూ.75 వేలు
  • మైనార్టీలకు – రూ.లక్ష
  • వికలాంగులకు – రూ.1.50 లక్షలు
  • భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు

అర్హతలు, విధి విధానాలు ఇవే..

  • వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్దిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.
  • వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత.
  • వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు)
  • వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
  • మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండవచ్చు.
  • కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల మినహాయింపు ఉంది.
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
  • నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
  • ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
  • మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
  • ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.

 

Leave a Comment