హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు నగరంలో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో నగరంలోని వసతి గృహాలను నిర్వాహకులు ఖాళీ చేయిస్తున్నారు. అమీర్పేట, పంజాగుట్ట, బాలానగర్లో పెద్దసంఖ్యలో ఉన్న వసతి గృహాల నుంచి విద్యార్థులను నిర్వాహకులు పంపించేస్తున్నారు. దీంతో తాము ఎక్కడికి వెళ్లాలంటూ విద్యార్థులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, రాయదుర్గం పోలీస్స్టేషన్ల వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. సొంతూళ్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు పరిష్కారం చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.