‘ఐ లవ్ యు’ అనే వాట్సాప్ స్టేటస్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది..!

వాట్సాప్ స్టేటస్ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. తన ఫ్రెండ్ ప్రియురాలి ఫొటోను పెట్టి.. ఐ లవ్ యూ అని రాయడంతో వివాదాస్పదమైంది. చివరికి అతడి చావుకు కారణమైంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు తాడేపల్లికి చెందిన గురవయ్య, శివ కుమారి దంపతులకు వెంపటి సాయి ఏకైక కుమారుడు. 

అతడు విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈక్రమంలో అక్కడ కొంత మంది విద్యార్థులు అతనికి పరిచయమయ్యారు. వారిలో ఒకరు ఐటీఐ విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి తన ఇంటికి సమీపంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతి ఫొటోను వెంపటి సాయి తన స్టేటస్ లో పెట్టి.. ఐ లవ్ యు అని రాశాడు. 

ఆ స్టేటస్ ను ఐటీఐ విద్యార్థి చూశాడు. వెంటనే సాయిని ఉండవల్లి సెంటర్ కి పిలిపించి మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డాడు. అనంతరం సాయి కనిపించకుండా పోయాడు. దీంతో సాయి తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో సాయి వడ్డేశ్వరం వద్ద బకింగ్ హామ్ కెనాల్ లో శవమై కనిపించాడు. సాయిని అతని స్నేహితులు చంపి కాలువలో పడేశారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.   

 

Leave a Comment