ఢిల్లీలో మళ్లీ హింస..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఓ వైపు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో సహా భారత పర్యటనలో ఉండగా ఈ ఘర్షణలు చెలరేగడం గమనార్హం. సోమవారం జఫ్రాబాద్, మౌజ్ పూర్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో ఓ పోలీసు మరణించాడు. గోకుల్ పురిలో ఆందోళనకారులు జరిపిన రాళ్ల దాడిలో గాయపడి మృతి చెందిన ఇతడిని రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు. మరికొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. సీఏఏకి వ్యతిరేకండా ఆందోళన చేస్తున్న నిరసనకారులకు, ఈ చట్టానికి అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్న వారికి మధ్య ఘర్షణలు రేగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులు పలు వాహనాలకు, షాపులు, ఇళ్లకు నిప్పు పెట్టారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి..భాష్పవాయువు ప్రయోగించారు. జఫ్రాబాద్, మౌజ్ పూర్ రోడ్డులో ఒక యువకుడు పోలీసులపై నాటు తుపాకీతో 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. అతి కష్టం మీద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలోనే నిన్న రాత్రి కూడా అల్లర్లు జరిగాయి. చాంద్ బాగ్ అనే ఏరియాలో జరిగిన హింసాకాండలో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. కొన్ని వాహనాలకు, ఇళ్లకు నిప్పు పెట్టారు.

Leave a Comment