ట్రాఫిక్ చలానాలతో విసిగిపోయి.. ఏకంగా బైక్ నే తగలబెట్టాడు..!

ట్రాఫిక్ చలానాలతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన బైక్ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి సంగప్పకు TS 34 D 2183 నంబర్ గల బైక్ ఉంది. బైక్ పై కూలి పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లివస్తుంటాడు. 

ఈక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ట్రాఫిక్ పోలీసులు చాలానాలు వేశారు. అలా వేసిన చలానాలు సుమారు రూ.5,500 పెండింగ్ లో ఉన్నాయి. ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో తాండూర్ మండల్ గౌతాపూర్ గేటు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తన బైక్ పై రూ.5 వేలకు పైగా చలానా ఉందని పోలీసులు అడ్డుకున్నారు. 

వెంటనే చలానా చెల్లించాలని సంగప్పను పోలీసులు కోరారు. అయితే పోలీసులు ఫొటోలు తీసి చలానాలు వేస్తున్న తీరును సంగప్ప భరించలేకపోయాడు. తన బైక్ ను పెద్దేముల్ సొసైటీ వెనుక భాగంలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కూలి పనులు చేసే తాను ఇంత మొత్తాన్ని ఎలా కట్టగలనని, ఆవేదనతోనే బైక్ ను తగలబెట్టానని సంగప్ప చెప్పారు. ఈ బైక్ తనకు అత్తింటివారు బహుమానంగా ఇచ్చారన్నారు. చలానా భయానికి ఏకంగా బైక్ నే తగలబెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

 

Leave a Comment