ఎదురు కట్నం ఇచ్చి యువతిని పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలతో వధువు పరార్..!

తనకు పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు.. తీరా పెళ్లయ్యాక డబ్బులు, నగలతో ఆ వధువు ఉడాయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. మణిపురి బెవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరౌంఖా గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తికి వయస్సు మీద పడుతున్నా పెళ్లి కావడం లేదు. దీంతో పెళ్లి కావడం లేదనే ఆందోళన రాజుకు ఎక్కువైంది.

 ఈక్రమంలో ఓ మధ్యవర్తి ద్వారా రాజుకు ఒక సంబంధం కుదిరింది. అయితే పెళ్లి కూతురు మాత్రం రాజుకు ఓ డిమాండ్ చేసింది. తనను పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నం ఇవ్వాలని చెప్పింది. ఎదురు కట్నంగా రూ.80వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు రాజు తండ్రి ఒప్పుకున్నాడు. 

పెళ్లికి ముందు వధువుకు రూ.80 వేల ఇచ్చి ఓ ఆలయంలో పెళ్లి చేశారు. డబ్బుతో పాటు నగలు, ఇతర బహుమతులు కూడా ఇచ్చారు. పెళ్లయ్యాక సొంత గ్రామం బయలుదేరేందుకు బస్టాండ్ కు వెళ్లారు. బస్సు కోసం వేచి చూస్తుండగా తనకు దాహం వేస్తుందని వధువు చెప్పింది. దీంతో రాజు నీళ్లు తెచ్చేందుకు వెళ్లాడు. అంతే తిరిగి వచ్చేసరికి ఆ వధువు కనిపించలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు రాజు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment