ఏపీలో బీజేపీనే బలమైన పార్టీ : ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్ చేసి పిలిస్తేనే ఆయనతో భేటీ అయ్యానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ తో ఆదివారం ఆయన భేటి అయిన సంగతి తెలిసిందే.. ఈ భేటీకి సంబంధించిన వివ‌రాల‌ను ఉండ‌వ‌ల్లి సోమ‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. 

కేసీఆర్ తో జరిగిన భేటీలో ఎలాంటి పార్టీ గురించి చర్చ జరగలేదని,రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తాము చ‌ర్చించుకున్నంత సేపు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా అక్క‌డే ఉన్నార‌ని తెలిపారు. అయితే ప్ర‌శాంత్ కిశోర్ చ‌ర్చ‌లో పాలుపంచుకోలేద‌ని తెలిపారు. 

ఏపీలో అన్ని పార్టీల కంటే బీజేపీనే బ‌ల‌మైన పార్టీ అని ఉండ‌వ‌ల్లి చెప్పారు. ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలుగానే భావించాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ భేటీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాల‌న‌పైనే చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. దేశంలో మోదీ పాల‌న‌ను వ్య‌తిరేకించే వారిలో కేసీఆరే బ‌ల‌మైన నేత‌గా ఉన్నార‌న్నారు. 

తాను బీజేపీకి వ్య‌తిరేకం కాద‌ని, ఆ పార్టీ విధానాలతో తాను వ్య‌తిరేకిస్తాన‌ని ఉండవల్లి చెప్పారు. బీజేపీ విధానాలు ఇప్పుడున్న‌ట్లుగా మ‌రింత మేర పెరిగితే ప్ర‌మాద‌మేన‌ని అన్నారు. ఈ విష‌యంపైనే తాము ప్ర‌ధానంగా చ‌ర్చించుకున్నామ‌న్నారు. కేంద్రంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే దిశ‌గా కేసీఆర్ సుదీర్ఘ క‌స‌ర‌త్తే చేశార‌న్నారు. బీజేపీపై కేసీఆర్‌తో పాటు త‌న‌దీ ఒక‌టే అభిప్రాయ‌మ‌ని ఆయ‌న చెప్పారు. 

 

 

Leave a Comment