తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కన్నుమూత..!

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) బుధవారం కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. చికిత్స పొందుతుండగా దుర్గాప్రసాద్ కు తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన బుధవారం మరణించారు. బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల వైసీపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దుర్గా ప్రసాద్ 28 ఏళ్ల వయస్సులోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. దుర్గాప్రసాద్ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. ఆయన 1985లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1994లో చంద్రబాబు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. బల్లి దుర్గాప్రసాద్  మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.    

 

Leave a Comment