టీటీడీకి అరుదైన గౌరవం.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు..!

తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శనివారం తిరుమలలో టీటీడీ పాలకమండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్ష్యులు సంతోష్ శుక్ల తరపున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ అందజేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకు పైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేసి భక్తులకు అందించడం జరుగుతోందన్నారు. కళ్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని ఆయన తెలిపారు.

 ఇంత మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదంలో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని సుబ్బా రెడ్డి చెప్పారు.  రోజు ఇన్ని లక్షల మంది విచ్చేస్తున్న తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి  పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఇతర ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన బుక్కులో తిరుమలకు చోటు కల్పించిందని ఆయన చెప్పారు.

 

Leave a Comment