ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సమ్మేటివ్, ఫార్మేటివ్ పరీక్షల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు..!

కరోనా మహమ్మారీ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా పదో తరగతి ఫలితాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ‘ఆల్ పాస్’కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది. 

విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన సమ్మేటివ్, ఫార్మేటివ్ పరీక్షల మార్కుల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇవ్వనున్నారు. గతేడాది కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేక రాష్ట్ర విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. వారి ధ్రువపత్రాల్లో సబ్జెక్టులకు గ్రేడ్లు బదులు.. పాస్ అని మాత్రమే ఇచ్చారు. దీంతో వారి ఉన్నత చదువులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈనేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరం విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 

2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు కేవలం 2 ఫార్మేటివ్ పరీక్షలు మాత్రమే జరిగాయి. వీటిలో ఆయా విద్యార్థులు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని పదో తరగతి ఫలితాలు ప్రకటించాలన్న అంశంపై కమిటీ దృష్టి సారించింది. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2 పరీక్షలు జరిగాయి. ఈ ఫార్మేటివ్ పరీక్షలు ఒక్కో దానికి 50 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులను గ్రేడ్ల కోసం పరిగణలోకి తీసుకోనున్నారు. ఇందులో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల మార్కులను సగటుగా తీసుకొని గ్రేడింగ్ ఇస్తారు. 

 

Leave a Comment