కరోనా కారణంగా రెండున్నరేళ్ల క్రితం ఐంటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటును కల్పించాయి. ఇప్పుడు ఆ సంస్కృతికి స్వస్తి చెబుతున్నాయి. తాజాగా దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. వారానికి మూడు రోజులు కచ్చితంగా ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది..
“వర్క్ ఫ్రం ఆఫీస్ కోసం మేనేజ్మెంట్ ఒక రోస్టర్ను తయారు చేస్తుంది. అందురు దానికి తగ్గట్టుగా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లఘిస్తే.. చాలా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి,” అని ఉద్యోగులకు చేసిన మెయిల్లో టీసీఎస్ స్పష్టం చేసింది.
ఉద్యోగులను ఆఫీసులకు తీసుకొచ్చేందుకు సంస్థ చేపట్టిన ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాము అని టీసీఎస్ యాజమాన్యం వెల్లడించింది. దీనికి 25X25 మోడల్ అని పేరు పెట్టింది. అంటే.. ఆఫీసుల్లో కనీసం 25శాతం జనాభా ఉండాలి. 2025నాటికి దీనిని అమలు చేసే యోచనలో దిగ్గజ ఐటీ సంస్థ ఉంది. అయితే.. ఆఫీసులకు తిరిగొచ్చే విషయంలో ఉద్యోగులకు టీసీఎస్ ఇంకా ఎలాంటి డెడ్లైన్ ఇవ్వలేదు. కానీ సంబంధిత మేనజర్లను సంప్రదించాలని ఉద్యోగులకు సూచించింది. ప్రాజెక్టు అవసరాలు, ఫ్రెషర్స్- సీనియర్స్ కలయికతో రోస్టర్ను రూపొందించేందుకు టీసీఎస్ ప్రణాళికలు రచించింది.
అయితే వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు మొగ్గుచూపడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగాలను కూడా విడిచిపెట్టేస్తున్నారు కానీ ఆఫీసుకు వెళ్లడం లేదు. వర్క్ ఫ్రం హోం ఇచ్చే వేరే సంస్థలో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఐటీ రంగంలో ఆట్రిషన్ రేటు విపరీతంగా పెరిపోయింది. రాజీనామాలు ఎక్కువగా ఉంటుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. ఇది సంస్థల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.