మధ్యాహ్నం భోజనం చేశాక కాస్త మబ్బుగా అనిపిస్తుంది. కునుకు తీయాలని ఉంటుంది. కానీ అలా చేయలేని పరిస్థితులుంటాయి. అయితే ఈ నిద్ర పరిణామాలను న్యూట్రిషనిస్టులు ఏం చెబుతున్నారంటే..
చాలా మంది మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న కునుకు తీస్తే బాగుంటుంది అనుకుంటారు. వాస్తవానికి మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వచ్చే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హానికరమా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం కునుకు తీస్తే రాత్రి నిద్ర రాదేమోనని కొందరు భావిస్తారు. అది కేవలం అపోహ మాత్రమేనని పేర్కొంటున్నారు.
అన్ని మతాల్లోనూ మధ్యాహ్నం కాస్త కునుకు తీస్తే మంచిదేనని ప్రస్తావన ఉంది. మధ్యాహ్నం నిద్రతో ఎంతో మానసిక ప్రశాంతత లభించి తాను ఎన్నో విజయాలు సాధించానని సాకర్ స్టార్ రొనాల్డో ఎన్నో సందర్భాలలో పేర్కొన్నారని న్యూట్రిషనిస్టు తెలిపారు. ఈ నిద్ర వల్ల షుగర్, థారాయిడ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయట. హార్మోన్లు చురుగ్గా పనిచేస్తాయట. తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. స్థూలకాయం లాంటి సమస్యలను సులువుగా అధిగమించవచ్చు.
మధ్యాహ్నం నిద్ర వల్ల ప్రయోజనాలు..
- హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. తద్వారా డయాబెటీస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.
- జీర్ణక్రియ మెరుగవుతుంది.
- హైబీపీని నియంత్రిస్తుంది.
- కొవ్వు కరుగుతుంది.
- రాత్రివేళలో కంటి నిండా నిద్ర వస్తుంది.
- స్థూలకాయ సమస్య నుంచి బయటపడవచ్చు.
- అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఉపకరిస్తుంది.
ఎంత సమయం నిద్రించాలి..
- చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారికి గరిష్టంగా 90 నిమిషాలపాటు నిద్ర శ్రేయస్కరం.
- ఆరోగ్యవంతులు, సాధారణ వ్యక్తులైతే 10 నుంచి గరిష్టంగా 30 నిమిషాలు కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు.
ఎలా నిద్రించాలి..
గర్భంలో శిశువు ఉండే మాదిరిగా ముడుచుకుని పడుకోవాలి. అయితే ఎడమవైపు తిరిగి నిద్రిస్తే అధిక ప్రయోజనం ఉంటుందట.