ఎవరు మీలో కోటీశ్వరులులో తొలిసారిగా కోటి గెలుచుకున్న పోలీసోడు..!

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో అత్యధిక నగదు కోటి రూపాయలు గెలుచుకున్న తొలి విజేత నమోదయ్యారు.. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంకు చెందిన 33 ఏళ్ల రాజా రవీంద్ర ఈ రికార్డు సృష్టించారు. ఈయన పోలీస్ డిపార్ట్ మెంట్ లో సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్నారు. గతంలో కోటి రూపాయల ప్రశ్నను ముగ్గురు ఎదుర్కొన్నారు. అయితే దానిని సైరైన సమాధానం చెప్పలేక వదులుకున్నారు. కానీ ఈ పోలీస్ మాత్రం సాహసం చేసి సమాధానం చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్నారు. దీని తాలూకు ఎపిసోడ్లు ఈ వారంలోనే ప్రసారం కాబోతున్నాయి..

రవీంద్ర బీటెక్ తో పాటు ఎంఏ, ఎల్ఎల్బీ కూడా చదివారు. 2012లో పోలీస్ శాఖలో చేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంధని సర్కిల్ లోని ముత్తారంలో ఎస్సైగా పనిచేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం సీఐడీ సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్నారు. రవీంద్ర ఎస్సైగా పోలీస్ శాఖలో పనిచేస్తూనే 2015 నుంచి ఎయిర్ రైఫిల్ విభాగంలో తెలంగాణ పోలీస్ శాఖ తరఫున పాల్గొన్నారు. 

2016లో పూణెలో జరిగిన పోటీల్లో ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. 2017లో గౌహతిలో జరిగిన పోటీల్లో అదే విభాగంలో స్వర్ణ పతకం దక్కించుకున్నారు. 2019లో ఆలిండియా పోలీస్ పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించారు. చైనాలో జరిగిన వరల్డ్ షూటింగ్ పోటీల్లో ఆయన కూడా పాల్గొన్నారు. తాను ఒలింపిక్స్ లో పాల్గొనాలనే లక్ష్యంతో ఉన్నట్లు రవీంద్ర చెబుతున్నారు. ఈ షోలో గెలుపొందిన కోటీ నగదును అధిక మొత్తాన్ని దాని కోసమే ఉపయోగిస్తానని తెలిపారు. 

 

Leave a Comment