మార్చి 2 నుంచి ఎస్ బీఐ కార్డ్స్ ఐపీఓ

ఎస్ బీఐ క్రెడిట్ కార్డుల విభాగం, ఎస్ బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఐపీఓ మార్చి 2 నుంచి ఆరంభమవుతుంది. ఈ ఐపీఓ మార్చి 5న ముగుస్తుంది. దీని ద్వారా ఈ కంపెనీ రూ.9,000 కోట్లు సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా ఆఫర్ ఫర్ సేట్ విధానంలో 13 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తారు. దీనిలో ఎస్ బీఐ 3.7 కోట్లు, కార్లైల్ గ్రూపు 9.3 కోట్ల షేర్లను విక్రయిస్తారు. మార్కెట్ లాట్ గా 19 షేర్లను నిర్ణయించారు. ఈ ఐపీఓకు ప్రైస్ బాండ్ రూ.750 నుంచి 755 గా ఉండవచ్చని భావిస్తున్నారు. ఎస్ బీఐ ఉద్యోగులకు 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వచ్చే నెల 16న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జీఎమ్ పీ రూ.320 నుంచి 330 రేంజ్ లో ఉందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీఓ కానుంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, డీఎస్పీ మెరిల్ లించ్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ, హెచ్ఎస్ బీసీ సెక్యూరిటీస్, ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తున్నాయి.

ఎస్ బీఐ కార్ట్స్ కంపెనీలో ఎస్ బీఐకు 76 శాతం, కార్లైల్ గ్రూపునకు 24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఐపీఓలో భాగంగా 10 శాతం వాటాకు సమానమైన షేర్లను కార్లైల్ గ్రూపు, 4 శాతం వాటా సమానమైన షేర్లను ఎస్ బీఐ విక్రయిస్తుంది. దేశంలో అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేసిన రెండో అతిపెద్ద కంపెనీగా ఎస్ బీఐ కార్డ్స్ నిలిచిందిద. మన దేశ క్రెడిట్ కార్డుల మార్కెట్లో ఈ కంపెనీ వాటా 18 శాతంగా ఉంది. ఈ కంపెనీ వినియోగదారులు 90 లక్షలకు పైగా ఉన్నారు. ఈ కంపెనీ ఐపీఓ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఈ కంపెనీ అత్యధిక వాటా ఉన్న ఎస్ బీఐ షేర్ లాభపడింది. బీఎస్ఈలో 2.3 శాతం లాభంతో రూ.328 వద్ద ముగిసింది.

Leave a Comment