మన బ్యాంక్ అకౌంట్ లో అనుకోకుండా కోట్ల డబ్బులు జమా అయితే భలే ఉంటుంది కదూ.. ఆ డబ్బులు సంపాదించాలంటేనే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది ఒక్కసారిగా అంత డబ్బు అకౌంట్లో వచ్చి చేరితేే.. ఆ ఫీలింగ్ చెప్పలేం.. తాజాగా కొంత మంది హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు అదే జరిగింది.
వంద మంది హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు ఒక్కొక్కరికి రూ.13 కోట్ల డబ్బు జమ అయ్యింది. వారి మొబైల్ ఫోన్లకు వచ్చిన మెసేజ్ లు చూసి వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన చెన్నైలోని టి.నగర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో చోటుచేసుకుంది. ఖాతాదారులు ఇది నిజమా? కాదా.. అంటూ తమ బ్యాలెన్స్ చేసుకున్నారు. నిజమే అని తెలిసింది..
ఈ వంద మందే కాకుండా మరి కొంత మంది అకౌంట్లకు రూ.10 వేలు, రూ.50 వేలు, రూ.లక్ష నగదు డిపాజిట్ అయ్యాయి. ఈ విషయం బ్యాంక్ సిబ్బందికి తెలియడంతో వారు కూడా షాక్ అయ్యారు. బ్యాంక్ అధికారులు వెంటనే డబ్బులు పడిన ఖాతాలను స్తంభింపజేశారు. కస్టమర్లకు డబ్బులు తీయవద్దని మెసేజ్ లు చేశారు. డబ్బులు పడితే ఊరుకుంటారా.. కొంత మంది కస్టమర్లు డబ్బులు తీసేసుకున్నారు..
టి.నగర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఇటీవల సాఫ్ట్వేర్లో కొత్తగా మార్పులు చేశారు. సాంకేతిక లోపం వల్ల నగదు బదిలీ జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై బ్యాంకు ఖాతాదారులు ఫెడరల్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఇంటర్నెట్ సర్వీస్ను హ్యాక్ చేసి ఎవరైనా నగదు బదిలీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.