ఓ వృద్ధురాలి ఖాతాలో ఏకంగా 10 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో ఆ వృద్ధురాలు విస్తుపోయింది. పింఛన్ తో జీవితం సాగించే తనకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా జమ అయ్యాయని షాక్ అయింది. ఈ ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల మేరకు రాయచూరు తాలూకా గుంజళ్లిలో తాయమ్మ(65) అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె నెలకు రూ.3 వేలు పింఛన్ అందుకుంటుంది. అయితే గతేడాది డిసెంబర్ 20న ఆమె అకౌంట్ కి పది కోట్ల 38 లక్షల 62 వేల రూపాయలు జమ అయ్యాయి. డిసెంబర్ 31న తాయమ్మ స్థానిక బ్యాంకుకు వెళ్లి పింఛన్ విత్ డ్రా చేసుకుంది.
అయితే తాయమ్మ వెంట వెళ్లిన వ్యక్తి ఆమె అకౌంట్ లో కోట్ల రూపాయల డబ్బు ఉండడాన్ని గమనించాడు. దీంతో మరుసటి రోజ జనవరి 1న రూ.8 లక్షలు డ్రా చేయాలని తాయమ్మను బ్యాంకుకు తీసుకెళ్లాడు. అయితే బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి ఆమె అకౌంట్ ని పరిశీలించారు. కోట్ల రూపాయల నగదు ఉండటంతో షాక్ అయ్యారు. ఇంత మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందో విచారణ చేస్తామని, అప్పటి వరకు డబ్బులు డ్రా చేయవద్దని వారిని వెనక్కి పంపించారు. బ్యాంక్ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో తాయమ్మ భర్త రామన్న గురువారం రాయచూరు జిల్లా ఎస్పీకి దీనిపై ఫిర్యాదు చేశారు.