కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకం తీసుకురానుంది. చాలా మంది వలస కార్మికులు, కూలీలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. వారు ఆయా ప్రాంతాల్లో అద్దె ఇంటి కోసం ఇబ్బందులు పడుతుంటారు. కొందరికి ఇల్లు దొరక్కా..మరి కొందరు రెంట్లు కట్టలేక తంటాలు పడుతుంటారు. సో..
అలాంటి వారికి ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. వీరి కోసం త్వరలో రెంటల్ హౌసింగ్ స్కీమ్ ను తీసుకొస్తోంది.
గతంలో యూపీఏ ప్రభుత్వం అందించిన రాజీవ్ ఆవాస్ యోజన, జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ స్కీముల స్థానంలో ఈ కొత్త స్కీమ్ లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రెంటల్ హౌసింగ్ స్కీమ్ లో పీపీపీ మోడల్ కింద ఇల్లు నిర్మించనుంది.
ఈ స్కీమ్ ద్వారా తక్కువ ధరకే ఇల్లు అద్దెకు దొరుకుతుంది. ఇంటి అద్దె కూడా కేవలం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు ఉండవచ్చని అంచనా..అయితే అద్దె విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. దాని గురించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే విడుదల కాలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 14న రెంటల్ హౌసింగ్ స్కీమ్ కు సంబంధించి ప్రకటించారు. ఈ స్కీమ్ కు సంబంధించి కేబినెట్ నోట్ కూడా సిద్ధమైంది. హౌసింగ్ మినిస్ట్రీ ఆమోదం కూడా లభించింది. దీని కోసం తొలివిడత కింద రూ.700 కోట్లను కూడా కేటాయించింది. అయితే దీనికి కేబినెట్ ఆమోదం ఒక్కటి రావాల్సి ఉంది.