దేశంలోని అప్పుల్లో ఉన్న రాష్ట్రాల వివరాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం బులిటెన్ విడుదల చేసింది. 2021-22 బడ్జెట్ ప్రకారం ఏపీ ఆదాయంలో 14 శాతం వడ్డీలకు వెళ్తోందని తెలిపింది. ఆంద్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోయాయని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్ధారించిన రుణ్, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్ దాటేసిందని వివరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని, జీఎస్డీపీలో 9%పైగా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి అప్పు తీసుకుంటుందని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నెలరోజుల్లోనే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, చేబదులు అవకాశాలను పూర్తిగా వాడేసినట్టు తెలిపింది. ఈ స్థాయిలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రేనని పేర్కొంది.
తర్వాత స్థానాల్లో తెలంగాణ, మణిపూర్, నాగాలాండ్ ఉన్నట్టు ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్ లో రుణాలు తీసుకునే అవకాశం తెలంగాణలో లేదని, ఏపీకి మాత్రమే ఉందని ప్రకటించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ 4 వేల కోట్ల రుణం తీసుకుందని స్పష్టం చేసింది.
జాతీయ సగటుతో పోల్చుకుంటే ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం 8 శాతం దాటిందని ఆర్బీఐ వెల్లడించింది. 2021-22 బడ్జెట్ ప్రకారం ఏపీ ఆదాయంలో 14 శాతం వడ్డీలకు వెళ్తోందని తెలిపింది. పంజాబ్ తర్వాత అత్యధిక మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నట్టు వెల్లడించింది.
మొత్తం ఆదాయంలో 14.1 శాతం, సొంత ఆదాయంలో 30.3 శాతం ఉచిత పథకాలకు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది వీటి కోసం రూ.27,541 కోట్లు ఖర్చు పెట్టినట్ట ఆర్బీఐ వెల్లడించింది. గ్యారంటీల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఇస్తోందని ఆర్బీఐ వెల్లడించింది.