రామెజీకి చంద్రబాబు అంటే ప్రేమ… మోదీ అంటే భయం : మంత్రి పేర్ని నాని

 రాష్ట్రంలో చంద్రబాబు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడని, ఆఖరికి న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టలేదని రాష్ట్ర పౌరసంబంధాలు, రవాణాశాఖా మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు.  తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థానంలో వున్న వారి కుటుంబ సభ్యులు కూడా అమరావతి భూముల కుంభకోణంలో వున్నందున సీబిఐ విచారణను కోరుతున్నామని అన్నారు. న్యాయ వ్యవస్థపై మిథున్ రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించిన అంశాలపై కేంద్రం, సుప్రీం దృష్టి సారించాలని కోరారు. 

ఈనాడు రామోజీది మహాభారతంలో దృతరాష్ట్రుడు పాత్ర

చంద్రబాబు ఈ దేశంలోని నాలుగో స్థంభంగా వున్న మీడియాను సైతం భ్రష్టు పట్టించాడని, చంద్రబాబుకు వత్తాసు పలికే ఈనాడు పత్రికలో పెట్రో బాంబ్‌  పేరుతో  పెద్ద ఎత్తున వార్తా కథనం ప్రచురించారని అన్నరు. ఈ కథనం చూస్తుంటే… మహాభారతంలో దృతరాష్ట్రుడు కౌరవుల పట్ల, పాండవుల పట్ల ఏరకంగా వ్యవహరించాడో అలాగే పక్షపాతంతో ఎల్లో మీడియా వ్యవహరిస్తోందనే విషయం అర్థమవుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్ల బాగు ఎలా అనే అంశం మీద క్యాబినెట్ లో చర్చించి.. ఒక జీవో ద్వారా కాకుండా, ఒక చట్టం తీసుకురావటం ద్వారా.. ఈ పెంపు ద్వారా వచ్చిన డబ్బులు ఎక్కడికీ మళ్ళకుండా రోడ్ల బాగుకే వినియోగించేలా… రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈనాడుకు ఎందుకంత బాధ.అని ప్రశ్నించారు.  

అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రో ఉత్పత్తుల ధరలను మాత్రం గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు లీటర్‌కు రూ.10 పెంచిందన్నారు. ఇది ఈనాడు రామోజీరావుకు కనిపించ లేదా? అంటే చంద్రబాబుపై ప్రేమ… ప్రధాని నరేంద్రమోదీ పట్ల భయం ఉందని పేర్కొన్నారు. తన పత్రికలో దీనిపై కథనం రాసే సాహసం రామోజీరావు చేయరన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ గారిపై మాత్రం తన పత్రికలో విరుచుకుపడతారన్నారు. 

 

Leave a Comment