రెండు గ్రామాల మధ్య ఘర్షణ పెట్టిన పబ్జీ..!

పబ్జీ ఘర్షణ పెట్టడం ఏంటని అనుకుంటున్నారా.. అవును నిజమే.. ఈ ఆట ఏపీలో రెండు గ్రామాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఇరు గ్రామాల వారు ఒకరికొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

నూజివీడులోని కాలేజీ నుంచి బస్సులో వస్తూ కొత్తూరు తండా, సిద్దార్ధ నగర్ విద్యార్థులు పబ్జీ ఆడారు. ఈక్రమంలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి బాహా బాహీకి దిగారు. ఈ గొడవ మరింత ముదిరింది. ఈ గొడవలో పెద్దలు కూడా జోక్యం చేసుకున్నారు. దీంతో ఘర్షణకు దారితీసింది. 

ఇరు గ్రామాస్తుల వారు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో రెండు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు గ్రామాల పెద్దలతో మాట్లాడి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అయితే భారత్ లో పబ్జీ నిషేధం ఉన్నా.. ఇతర మార్గాల్లో అక్రమంగా డౌన్ లోడ్ చేసుకొని ఆడుతున్నారు. 

Leave a Comment