రాజ్యసభలో ప్రధాని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న నేతలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పదవీ కాలం కూడా ముగియనున్నది. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. ఆ సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
గులాం నబీ ఆజాద్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. ఆజాద్ జమ్మూ కశ్మీర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసిన మేలు మరువలేనిదని మోడీ గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు గుజరాత్ పర్యాటకులు చిక్కుకున్నారని, ఆ సమయంలో ఆజాద్, ప్రణభ్ ముఖర్జి చేసిన సాయం మరువలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు.
గుజరాతీ పర్యాటకులను ఆజాద్ రక్షించారని మోడీ పేర్కొన్నారు. ఈ సమయంలో కొన్ని క్షణాల పాటు దుఖ్కాన్ని ఆపుకునేందుకు ప్రయత్నించారు. సొంత కుటుంబ సభ్యుల కోసం తాపత్రయ పడినట్లు ఆజాద్ స్పందించారని మోడీ చెప్పారు. ఆజాద్ చేసిన సహాయాన్ని గుర్తూ చేస్తూ ఆయనకు సెల్యూట్ చేశారు.
ఉన్నత పదువులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ గులాం నబీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు. గులాం నబీ తనకు చాన్నాళ్ల నుంచి తెలుసని, ఒకేసారి సీఎంలుగా పనిచేశామని గుర్తు చేశారు. ‘నేను మిమ్మల్ని పదవీ విరమణ చేయనివ్వను. నేను మీ సలహాలు తీసుకుంటాను. నా తలుపులు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి’ అంటూ గులాం నబీ ఆజాద్ తో మోడీ అన్నారు.
#WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT
— ANI (@ANI) February 9, 2021