ఎన్టీఆర్ వర్ధంతి.. నారా లోకేష్ రక్తదానం..!

టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్ ఎన్ఠీఆర్ ఘాట్ లో చంద్రబాబు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రక్తదానం చేశారు. 

ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘సామాన్య రైతు బిడ్డగా పుట్టి వెండితెర దేవుడై వెలిగి, మనిషి ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని నిరూపించారు. అరవై ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో, సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని, చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారు. దటీజ్ ఎన్టీఆర్.’ అంటూ ట్వీట్ చేశారు. 

‘మహిళలకు ఆస్తిహక్కు కల్పించినా, బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పచెప్పినా, పేదలకు వినూత్న సంక్షేమ పథకాలు అందించినా సమసమాజ స్థాపనే ఎన్టీఆర్ గారి లక్ష్యం. ఆయన కీర్తిశేషులై 25 ఏళ్లు అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మానవతావాది ఆశయసాధనకు పునరంకితమవవుదాం’ అంటూ పిలుపునిచ్చారు. 

 

Leave a Comment