టర్మ్ లోన్లపై ఇన్ స్టాల్మెంట్స్ లేదు..

మంద‌గ‌మ‌నంలోకి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌

హైద‌రాబాద్‌ : ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నంలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్‌ దాస్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మునుముందు చాలా గ‌డ్డు రోజులు ఉన్నాయ‌ని, కాగా అవి ఎక్క‌వ రోజులు ఉండ‌వ‌న్నారు. కానీ క‌ఠిన‌మైన వ్య‌వ‌స్థలు మాత్రం ఆ గ‌డ్డు ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్కుతాయ‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌పంచ‌దేశాల ఆర్థిక స్థితి స‌రిగా లేద‌న్నారు. ఒక‌వేళ కోవిడ్‌19 కేసులు ఇలాగే పెరిగితే, అప్పుడు ప‌రిస్థితి ఆందోళ‌న‌కంగా ఉంటుంద‌న్నారు.  స‌ప్లై చైయిన్ దెబ్బ‌తింటుంద‌ని, దాని వ‌ల్ల భార‌త వృద్ధి కుంటుప‌డుతుంద‌న్నారు. అయితే అంత‌ర్జాతీయంగా ఇంధ‌న ధ‌ర‌లు త‌గ్గ‌డం వ‌ల్ల ఇది మ‌న దేశానికి దోహ‌ద‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక మంద‌గ‌మ‌నం ఏర్పడినట్లు గుర్తించామ‌న్నారు. క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్‌తో ఈ పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. సోష‌ల్ డిస్టాన్సింగ్ లాంటి నియ‌మాల వ‌ల్ల కూడా ప‌రిస్థితి భ‌యాన‌కంగా ఉంద‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ నెమ్మ‌దిగా కోలుకుంటుంద‌న్న ఆశ‌ల‌ను కూడా క‌రోనా దెబ్బ‌తీసింద‌న్నారు. బ‌్యాంకు రుణాల‌పై మూడు నెల‌ల మారిటోరియం విధిస్తున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. 

ట‌ర్మ్ లోన్ల‌పై మూడు నెల‌ల పాటు ఇన్‌స్టాల్మెంట్స్ ఏమీ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్బీఐ చెప్పింది.  రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు క‌ట్ చేస్తున్న‌ట్లు శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. అన్ని బ్యాంకుల‌ క్యాష్ రిజ‌ర్వ్ రేషియోల‌ను కూడా త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు.  వంద బేసిస్ పాయింట్ల నుంచి నెట్ డిమాండ్‌లో మూడు శాతానికి త‌గ్గించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ నియ‌మం ఏడాది పాటు వ‌ర్తించ‌నున్న‌ది. దీని ద్వారా బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి 3.74 ల‌క్ష‌ల కోట్లు వ‌స్తాయ‌న్నారు.

 

Leave a Comment