‘నర్సీపట్నం పులిని చూసి.. పులివెందుల పిల్లి భయపడింది’ 

అనాకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటి ప్రహరీని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని ఆరోపిస్తూ జేసీబీలతో ఇంటి గోడను కూల్చారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.. 

నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందంటూ సెటైర్లు వేశారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్‌ డ్రామా చేశారన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతరకు జగన్‌ జడుసుకున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా జగన్‌ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని, మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్‌ దుస్థితి చూస్తుంటే జాలేస్తుందంటూ నారా లోకేష్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయ్యన్నపై కక్ష సాధింపును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 

Leave a Comment