కొత్త సంవత్సరం వేళ జమ్మూకశ్మీర్ లో విషాదం జరిగింది. మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు మృతి చెందగా.. పలువురికి గాయలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు ఢిల్లీ, హరియాణా, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటన తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో జరిగింది.
కొత్త ఏడాది సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. చాలా మంది భక్తులు పర్మిషన్ స్లిప్స్ లేకుండానే ఆలయంలోకి ప్రవేశించారు. దీని వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ తొక్కిసలాట త్రికూట కొండలపై ఉన్న గర్భగుడి వెలుపల గేట్ నంబర్ 3 వద్ద జరిగినట్లు సమాచారం.. మృతల కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును దేవాలయ బోర్డు భరిస్తుందని తెలిపారు.
ప్రధాని మోడీ సంతాపం:
మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన ఘటనపై ప్రధాని మోడీ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.