సాయి ధరమ్ తేజ్ గురించి చూపిస్తారు.. చిన్నారి గురించి చూపించరా.. అంటూ మీడియాపై మంచు మనోజ్ ఫైర్..!

సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారి హత్యాచారంపై తొలిసారిగా ఓ హీరో స్పందించాడు. ఈ ఘటనపై మీడియా వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశాడు. ఈ ఘటనలో బాలిక కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఈనేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ ఆ పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాప తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. 

ఈ సందర్భంగా మీడియాతో మంచు మనోజ్ మాట్లాడాడు. చిన్నారి విషయంలో జరిగింది దారుణమైన చర్య అన్నాడు. ఈ ఘటనపై మనమందరం బాధ్యత వహించాలని పిలుపునిచ్చాడు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలని చెప్పారు. ఈ ఘటన జరిగి ఆరు రోజులు అవుతుందని, ఇంకా ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలియలేదని అన్నారు. పోలీసులు నిందితుడి గురించి చాలా సీరియస్ గా వెతున్నారని, అతడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఛత్తీస్ గడ్ లో మూడేళ్ల క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచాారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చిందని, సైదాబాద్ ఘటనకు కారణమైని నిందితుడిని 24 గంటల్లో పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీవీ ఆన్ చేస్తే సాయి ధరమ్ తేజ్ అలా పడ్డాడు.. ఇలా పడ్డాడు అంటూ త్రీడీ చేసి చూపిస్తున్నారు తప్ప.. ఈ విషయం గురించి ఎవరూ చూపించడం లేదన్నారు. మీడియా దయ చేసి దీన్ని హైలెట్ చేసి చూపించాలని కోరారు. చిన్నారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంచు మనోజ్ పేర్కొన్నాడు.  

  

Leave a Comment