ప్రేమ పేరుతో యువతులకు గాలం.. వివాహితుడి మోసాలు గుట్టురట్టు..!

ఫేస్ బుక్ లో యువతులను పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. ఆరుగురు యువతులను మోసం చేసి డబ్బులు వసూలు చేశాడు. అంతే కాదు కట్టుకున్న భార్యను కూడా వదిలించుకోవాలనుకున్నాడు. భార్య ఫిర్యాదుతో మోసాలకు పాల్పడుతున్న వివాహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన కుర్ర విజయభాస్కర్ 2017 జూన్ లో సౌజన్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. విజయభాస్కర్ జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో డబ్బు కోసం అతని భార్యను తరచూ వేధించేవాడు. తన అవసరాలు తీర్చకపోతు మరో పెళ్లి చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. 

ఈక్రమంలో ఫేస్ బుక్ లో పలువురు యువతులతో పరిచయం పెంచకున్నాడు. వారికి మాయమాటలు చెప్పి వారికి దగ్గరయ్యేవాడు. తర్వాత వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇలా ఆరుగురు అమ్మాయిలు అతడి చేతిలో మోసపోయారు. అయితే విజయభాస్కర్ వేధింపులకు విసిగిపోయిన భార్య సౌజన్య అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సాఫ్ట్ వేర్ ఉద్యోగినని తనను నమ్మించి పెళ్లి చేసుకున్నాడని, 25 తులాల బంగారం, 15 లక్షల కట్నం కూడా తీసుకున్నాడని తెలిపింది. మూడేళ్ల నుంచి నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో విజయభాస్కర్ మోసాలు బట్టబయలయ్యాయి.  

Leave a Comment