Viral Video: కూతురి శవాన్ని భుజాలపై 10 కి.మీ. మోసుకెళ్లిన తండ్రి..!

అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు అనారోగ్యంతో చనిపోయింది.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రాలేదు.. దీంతో తండ్రే తన కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని బయల్దేరాడు.. 10 కిలోమీటర్లు నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లాడు. ఈ హృదయ విదారక ఘటన చత్తీస్ గఢ్ లోని సుర్గుజా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో విచారణకు ఆదేశించారు.

ఆమదాల గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ కి సురేఖ(7) అనే కూతురు ఉంది. సురేఖకు తీవ్ర జ్వరం రావడంతో శుక్రవారం తెల్లవారుజామున లఖన్ పూర్ కమ్యునిటీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అప్పటికే ఆ బాలిక పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ లెవెన్స్ 60కి పడిపోయాయి. వైద్యులు చికిత్స అందించినప్పటికీ బాలిక పరిస్థితి మెరుగుపడలేదు.

 ఆరోగ్యం మరింత క్షీణించి ఉదయం 7.30 గంటలకు బాలిక చనిపోయింది. బాలిక చనిపోయిన విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఈశ్వర్ దాస్ తన కూతురి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. దాదాపు 10 కి.మీ. దూరం కూతురి మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ తన గ్రామానికి వెళ్లాడు. 

ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. మృతదేహాన్ని తరలించేందుక వాహనం వస్తుందని, ఉదయం 9.20 గంటల వరకు వేచి ఉండాలని చెప్పామని తెలిపాయి. కానీ ఈశ్వర్ దాస్ వేచి ఉండకుండా కూతురి మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయాడని పేర్కొన్నాయి. ఈశ్వర్ దాస్ తన కూతురి మృతదేహాన్ని భుజాలపై మోస్తూ తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.  

Leave a Comment