మొబైల్ ఫోన్ ఎంత ఉపయోగకరమో.. అంత ప్రమాదకరము కూడా.. ఇటీవల మొబైల్ ఫోన్లు పేలిన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఆన్ లైన్ క్లాసుల సమయంలో ఓ విద్యార్థి చేతిలో మొబైల్ ఫోన్ పేలింది. దీంతో ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
వివరాల మేరకు జిల్లాలోని చంద్ కుయా గ్రామానికి చెందిన రాం ప్రకాశ్ భదౌరియా(15) అనే 8వ తరగతి విద్యార్థి ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యాడు. ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండగా విద్యార్థి చేతిలోని ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ విద్యార్థి దవడకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఈ పేలుడు జరిగినప్పుడు ఆ విద్యార్థి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. రాంప్రకాశ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు.