చేతికి మొబైల్ దొరికితే చాలా పిల్లలు గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. వినోదం కోసం గేమ్స్ ని వ్యసనంగా మార్చుకుని కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా పబ్జి గేమ్స్ కి అలవాటు పడిన మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు (16) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. అయితే గేమ్లో ఓడిపోవడంతో ఇంట్లో వాళ్లు ప్రభును కాస్తా ఆటపట్టిస్తూ హేళన చేశారు. దీంతో అవమానం తట్టుకోలేకపోయాడు. వేరే గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో నిద్ర లేపేందుకు తండ్రి తలుపులు తీయడంతో గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించడంతో అది చూసిన తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.