ప్రకాశం జిల్లాలో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య..!

పెళ్లికి ఒప్పుకోరని ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఒంగోలు శివారు కొప్పోలుకు చెందిన భవనం వెంకటేశ్వరెడ్డి, సుజాత దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఒంగోలు రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 

విష్ణు తనకు స్మార్ట్ ఫోన్ కావాలని అడగటంతో తల్లి సుజాత కష్టం చేసి దాచిన రూ.12 వేలతో ఫోన్ కొనిచ్చింది. ఫోన్ వచ్చినప్పటి నుంచి విష్ణు ఎక్కువ సమయం ఫోన్ తో గడుపుతున్నాడు. ఈక్రమంలో అతడికి ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఇందు స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. 

ఇందు తండ్రి ఏడాది క్రితమే చనిపోయాడు. దీంతో తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. ఇంట్లోని ఒక భాగాన్ని అద్దెకు ఇవ్వడంతో వచ్చే డబ్బు, తల్లికి వచ్చే పింఛనే ఆ కుటుంబానికి జీవనాధారం.. విష్ణు, ఇందుల ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది. విష్ణు రెగ్యులర్ గా ఇందుతో మాట్లాడేవాడు. అయితే కొన్ని రోజుల క్రితం తన కుమారుడికి ఓ యువతి తరుచూ ఫోన్ చేస్తుండటాన్ని విష్ణు తల్లి సుజాత గమనించింది. 

ఈ వ్యవహారం తల్లికి తెలియడంతో విష్ణు తన ఫోన్ ను పగలగొట్టాడు. అయితే స్నేహితుడి మొబైల్ నుంచి ఇందుతో టచ్ లో ఉన్నాడు. సోమవారం రాత్రి ఇందు తన ఇంటి సమీపంలోని బడ్డీ కొట్టుకు వెళ్లి పెరుగు ప్యాకెట్ తెస్తానని వెళ్లింది. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. 

కాగా, మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలోని ఐఓసీ పెట్రోల్ బంక్ వెనుక రైల్వే ట్రాక్ పై యువ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలం వద్ద లభించిన హాల్ టికెట్ ఆధారంగా యువకుడు విష్ణువర్ధన్ రెడ్డి(19)గా, యువతి ఇందు(18) గా గుర్తించారు. వీరిద్దరికీ 9 నెలల కింద ఫేస్ బుక్ లో పరిచయం అయినట్లు వెల్లడైంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, కులాంతర వివాహానికి అడ్డంకులు వస్తాయనే భయంతోనే వారు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment