సమాజం కోసం పనిచేద్దాం : చంద్రబాబు పిలుపు

వ్యాక్సిన్ వచ్చే దాకా కరోనా మహమ్మారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రజలను అప్రతమత్తం చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం ఆయన హెల్త్ స్పెషలిస్ట్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కరోనా వైరస్ పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లకు సంఘీభావం, ప్రజలను అప్రమత్తం చేయడం ఈ కాన్ఫరెన్స్ లక్ష్యం అన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ కరోనా వైరస్ పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లకు సంఘీభావం, ప్రజలను అప్రమత్తం చేసేందుకే ఈ కాన్ఫరెన్స్ లక్ష్యం. ఇది ప్రజాహితం కోసం సమావేశం, ఇక్కడ రాజకీయాలు లేవు, సామాజిక బాధ్యతతో సమాజ హితం కోసం పెట్టిన సమావేశం. ఈ భేటిలో మీరిచ్చే సలహాలు, సూచనలను ప్రభుత్వానికి పంపిస్తాం.

కరోనా ముందు జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నాం. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ (జిఎఫ్ ఎస్ టి) ద్వారా ప్రతివారం కేంద్రానికి నివేదికలు పంపుతున్నాం. వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ మహమ్మారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రజలను అప్రమత్తం చేయడమే పరిష్కార మార్గం. అందరిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో దీనిపై భయాందోళనలు పెరిగే ప్రమాదం ఉంది.

కేసుల సంఖ్యలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో, మరణాల్లో రెండో స్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. ఇక దేశంలో 60 శాతం రికవరీ రేటు ఉంటే ఏపీలో 49.3 శాతం మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో వైరస్ టెస్టింగ్ లకు 18 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు సరిపోవడం లేదన్నారు. కరోనా చికిత్సలో స్టాండర్డ్ ప్రోసీజర్స్ అనుసరించాలన్నారు. 

ప్రజల్లో కోవిడ్ వైరస్ పట్ల అవగాహన పెరగాల్సి ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభంలో కీలక భూమిక ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో హెల్త్ అండ్ వెల్ నెస్ క్యాంపైన్ మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాతో కుటుంబ సంబంధాలు క్షీణించే దుస్థితి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. 

టెస్టింగ్  రిజల్ట్స్ లో జాప్యం వల్ల, సకాలంలో ఆసుపత్రిలో చేర్చుకోక పోవడంతో రోగులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.  మృతదేహాలను జెసిబిలతో తీసుకెళ్లడం బాధాకరమన్నారు.  టెస్టింగు రిపోర్టులు వచ్చేదాకా చికిత్స అందించక పోవడం, ఇతర రోగులు సకాలంలో సరైన వైద్యం అందక మృతి చెందుతున్నారన్నారు. టెస్టింగ్ రిజల్ట్స్ త్వరితగతిన వచ్చేలా చూడాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు లేనందున ఇళ్లలోనే ఉంటున్నారు, ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది.

ప్రస్తుత సంక్షోభంలో కోవిడ్ వైరస్ కట్టడిని ఒక సవాల్ గా తీసుకోవాలి. కరోనాపై యుద్దంలో అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ప్రజలను ఆదుకునే బృహత్కార్యంలో భాగస్వాములు అవుదామని, మనకోసం, మన కెరీర్ కోసం పని చేయడమే కాకుండా, సమాజం కోసం పనిచేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

Leave a Comment