వారు జైలుకెళ్తే…చూడాలని ఉంది

తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి

రాజమండ్రి : గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని పడిపడి దోచుకున్నారని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి విమర్శించారు. సోమవారం ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ భూములపై గత ప్రభుత్వం సిట్‌ వేసి చిన్న ఉద్యోగులను బలి చేశారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సిట్‌ ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. సిట్‌ అధికారులు, కేంద్ర బృందాలు సమన్వయంతో​ పకడ్బందీగా పనిచేస్తారని తెలిపారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా నాయుడు జైలుకి వెళ్లడం చూడాలని ఉందన్నారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబునను అండమాన్‌ జైలు పంపించాలని ఉందని ఎన్టీఆర్‌ అంటుండే వారని, ఆ రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నా అని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.

తెలుగుకు పూర్వవైభవం తీసుకువస్తాం..

ప్రాచీన తెలుగుకు పూర్వవైభవం తీసుకువస్తామని లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు సాహిత్య పీఠాన్ని యూనివర్శిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆంగ్లంతో పాటు తెలుగును కచ్చితంగా బోధించాలని ప్రైవేటు విద్యాసంస్థలకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్ధులను అన్నిరంగాలలో తీర్చిదిద్దడానికే తెలుగుతో పాటు ఆంగ్ల భాషకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె తెలిపారు. 

ఆ స్థలాలను తీసుకోవడం లేదు : ఎంపీ మార్గాని భరత్‌

తెలుగు సాహిత్య పీఠం స్థలాన్ని పేదల ఇళ్ళ స్థలాలకు తీసుకోవడం లేదని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు యూనివర్శిటీ అక్కడే ఉంటుందని.. విద్యార్థులు తక్కువ ఉన్నందున ఖాళీగా ఉన్న స్థలాన్ని అధికారులు పరిశీలించారంతేనని పేర్కొన్నారు.  విద్యాసంస్థలు, దేవాదాయ శాఖ భూములు ఇళ్ల స్థలాలకు సేకరించవద్దని సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు. తెలుగు యూనివర్శిటీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. త్వరలోనే వీసీని నియమిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. తెలుగు యూనివర్శిటీలో జ్యోతిష్యం, వాస్తు వంటి విభాగాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలుగు యూనివర్శిటీలో 1.2 ఎకరాలను చంద్రబాబు హయాంలో ప్రైవేట్‌ గ్యాస్‌ సంస్థకు ఇచ్చారని ఎంపీ మార్గాని భరత్‌ తెలిపారు.

 

Leave a Comment