కేంద్రంపై సమరానికి సిద్ధమైన కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై సమరానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ రెండో వారంలో కేంద్రానికి వ్యతిరేకంగా కాన్ క్లేవ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 10 మంది పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులతో కేసీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా హైదరాబాద్ లో వరద బాధితులకు సాయం అందకుండా మోడీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. ఎన్నికలను అడ్డం పెట్టుకుని పేదలకు సాయం అందకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడం వల్లే వరద సాయం నిలిచిపోతుందన్నారు. 

బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ రాష్ట్రానికి కొత్తగా ఒక్క సంక్షేమ పథకం కూడా తీసుకురాలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తోందని ఆరోపించారు. మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై డిసెంబర్ లో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గతంలో ఎన్నో ఎన్నికల్లో గెలిచాం.. ఓడాం.. ఒక్క ఓటమితో ఏమీ కాదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.   

 

Leave a Comment