అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అభిమానుల్లో భారీగా క్రేజ్ ఉంది. ఆయన పుట్టిన రోజును అభిమానులు భారీగా సెలబ్రేట్ చేస్తారు.. అయితే ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశాడు. కరోనా కాలంలో ఎవరూ తన బర్త్ డే(మే 20) వేడుకలు చేయవద్దని, ఇంటి వద్దనే ఉండి లాక్ డౌన్, కర్ఫ్యూ నియమాలను పాటించాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా తన విన్నపాన్ని అభిమానులకు తెలిపారు..

‘నా అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా మీ పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?.. ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకుని, కోవిడ్ ను జయిస్తాను అని ఆశిస్తున్నాను. 

ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి పట్టునే ఉంటూ, లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మన సంఘీభావం తెలపాలి.

 ఎందరో తమ ప్రాణాలను జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, చేతనైనా ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు, మాస్క్ ధరించండి. జాగ్రత్తగా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మీ తారక రామారావు’ అంటూ రాసుకొచ్చారు.. 

 

Leave a Comment