రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

జులైలో మంత్రి నేతృత్వంలోని బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటన

ఏపీఐఐసి కార్యాలయంలో జరిగిన ఓమ్ క్యాప్ బోర్డు మీటింగ్ లో కీలక నిర్ణయాలు

 భవిష్యత్ లో రాష్ట్ర యువతకు  అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పరిశ్రమలు, ఐటి, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఓంక్యాప్) ఉన్నతాధికారులతో బోర్డు మీటింగ్ జరిగింది. చైర్మన్ హోదాలో హాజరైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతత్వంలోని సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు, సరికొత్త కోర్సులు, శిక్షణ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు వెళ్లాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కరోనా ఉధృతి తగ్గిన తర్వాత వైద్యరంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయని డాక్టర్లు, నర్సులు, టెక్నిషియన్ల వంటి సమాచరం సేకరించడంపై దృష్టిసారించాలని మంత్రి పేర్కొన్నారు.  గల్ఫ్ దేశాలతో పాటు, జపాన్, స్వీడన్, ఇటలీ, జర్మనీతోపాటు యూరప్ దేశాల్లో వైద్యరంగంలో ఉద్యోగాలకు డిమాండ్ ఉందని, మన రాష్ట్రంలోని యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించి వారిని ప్రోత్సహించి వారి భవిష్యత్ ను తీర్చిదిద్దాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, టెక్నీషియన్లు, ఇతర వృత్తి నైపుణ్యం  ఉన్నవారు ఎక్కువ అవకాశాలు పొందేలా ఓంక్యాప్ కృషి చేయాలని, అవసరమైతే జులై నెలలో మంత్రి మేకపాటి నేతృత్వంలోని బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఓంక్యాప్ వెబ్ సైట్ ను ఆధునీకరించి విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కచ్చితమైన సమాచారం, సౌకర్యాలు అందేలా చూడాలని నిర్ణయించారు. ఉపాధి కోసం విదేశాల నుంచి ఏపీకి వచ్చే  వారికి నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా ఓవర్సీస్ స్కిల్స్ రిజిస్టర్ ను తయారు చేయాలని, ఆసక్తి, అనుభావాన్ని బట్టి ఉద్యోగం పొందేలా  తోడ్పాడునందించాలని తెలిపారు. దేశ, విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారుల సహకారంతో గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాల్లోని అంబాసిడర్లతో సంప్రదించి రాష్ట్రంలో అమలవుతున్న నైపుణ్యశిక్షణా కార్యక్రమాల గురించి వివరించాలని సమావేశంలో నిర్ణయించారు.  

 

Leave a Comment