భారత్ లో మత స్వేచ్ఛ ఆందోళనకరంగా ఉందని యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం(USCIRF) పేర్కొంది. శనివారం 2022 వార్షిక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ దేశాల్లో నెలకొన్న మత స్వేచ్ఛను, ఆయా దేశాల్లో జరిగిన ఘటనల ఆధారంగా లోతుగా పరిశీలించి ఏటా USCIRF ఒక నివేదికను యూఎస్ కాంగ్రెస్కు సమర్పిస్తుంది. ఈ నివేదికలో భారతదేశంలో మత స్వేచ్ఛ ఆందోళనకర స్థాయిలో ఉందని ప్రకటించాలని సూచించింది.
అయితే భారత్ లో మత స్వేచ్ఛపై అమెరికా కమిటీ ఇచ్చిన నివేదికను భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఆ నివేదికలో అన్నీ అవాస్తవాలు, అసంబంద్ధ సమాచారం ఉందని మండిపడింది. భారత్లో మత స్వేచ్ఛ ఆందోళన చెందాల్సిన స్థాయిలో ఉందన్న USCIRF వ్యాఖ్యను గట్టిగా ఖండించింది.
వాస్తవాలను వక్రీకరించి ఈ నివేదికను రూపొందించారని భారత విదేశాంగ శాఖ మండిపడింది. సొంత ఎజెండాలో భాగంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. నివేదికలో పేర్కొన్న ఆరోపణలను అంశాలవారీగా తోసిపుచ్చింది. భారత్లోని భిన్నత్వంలో ఏకత్వాన్ని, రాజ్యాంగ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను USCIRF సరిగ్గా అర్థం చేసుకోలేదని విమర్శించింది.